Wednesday 22 April 2015

 

   
ఎం.నారాయణ శర్మ's photo.
రేణుకా అయోల -నా నడకలో నగరం
______________________________________
యూంగ్ సాహిత్యానికి రెండు పార్శ్వాలుంటాయన్నాడు.ఒకటి మనస్తత్వాత్మక మైంది రెండు దర్శనాత్మకమైంది.(Psycologocal and Visionary)మనస్తత్వానికంటే మించిన సామూహిక చేతన ఒకటి మనిషిలో ఉంటుందని యూంగ్ నమ్మాడు.
ఆధునిక కాలంలో ఫ్రాయిడ్ అతని అనుయాయులువేసిన మార్గాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కొత్తమార్గాలనన్వేషించాయి,ఆవిష్కరించాయి.రేణుకా అయోల కవితలో సాహిత్యతత్వమూ,మనస్తత్వమూ రెండూ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.వేరొక ప్రదేశంలో ఉండి అక్కడి ప్రకృతిని చూసి తన దేశపు ,ప్రాంతపు ఉనికిని కవితలో రికార్డ్ చేయటం ఇందులో కనిపిస్తుంది.
"ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను
పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది
ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది "
ఈవాక్యాన్ని చూస్తే ఇందులో ఙ్ఞాపకం రూపంలో తనను వెంటాడుతున్నదేదో అర్థమవుతుంది.ఫ్రాయిడ్ "ప్రాక్ చేతనా"న్ని గురించి చెబుతున్నప్పుడు ఙ్ఞాపకాలను గురించి చెప్పాడు.ప్రాక్చేతనలోని అంశాలు దమనానికి లోనుకావు కాబట్టి అవి గుర్తుకు వచ్చే అంశాలు సంఘటనలు తారస పడినప్పుడు అవి చుట్టుముడుతాయి.ఫ్రాయిడ్ దీన్ని సంసర్గ విధానం(Associative Process)అన్నాడు.సన్నిహితంగా ఉండే రెండు అంసాలలో ఒకటి కనిపిస్తే మరొకటి గుర్తుకు రావటం.దమన శక్తులుగనక ప్రభావం చూపిస్తే అంశాలు స్వప్నాలుగా ప్రవేశిస్తాయి.
ఎర్రటి గులాబీలు,పల్చటిగాలి ,మట్టినిగుర్తుకు తేవడం ఇలాంటిదే.ఇలాంటి చేతన గురించి "మాండూక్యోపనిషత్తు" కొంత చెప్పింది.
"జాగరితస్థానొ బహిష్ప్రఙ్ఞ:"-ఇది జాగరితమై బహి: అంటే దేశ కాలస్పృహతో ఉంటుంది..ఇందులో కనిపించేది ఇదే...ఈ అంసాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేసే అంశాలు కవితలో ఉన్నాయి.
"మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం
నాదేశంలోకి తీసుకు వెళుతుంది
కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి
ద్వారాలు వేరవుతున్న చప్పుడు
అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు
వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు
ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు
ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు"
ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయి."ద్వారాలు వేరవటం""ప్రాణాలు తీసుకున్న చప్పుడు"-ఇలాంటివన్నీ ఆతరహా కాలిక స్పృహ కలిగిన అంశాలే.
ప్రతీవారిలో ఒకస్థిరమైన మానసిక వాతావరణం ఉంటుంది.అయోలాగారిలోనూ ఉంది.ఇది కొన్ని పద బంధాలద్వారా వ్యక్తమౌతుంది.
ఆకుపచ్చని గడ్డి అలలపై/ఆకుపచ్చని నిశ్బబ్ధం / ఆకుపచ్చని నీడ/ఆకుపచ్చని లోయ/ పచ్చదనం ఆకులు /ఈ పదాలు ఆ బౌద్ధిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.-ఒక శుభకరమైన ఆశంసని కోరుతూ ఈ కవిత ముగుస్తుంది.
ఇవి కూడా ఫ్రాయిడ్ చెప్పిన మనోనూర్తిమత్వ నిర్మితి(Anotamy of mental Personality)సంబంధించినవే..మంచికవిత అందించినందుకు అయోలా గారికి ధన్యవాదాలు.
Like · Comment · 

Tuesday 21 April 2015


జుగల్బంది



      


కాలచక్రంతో యుధం ముగిసాక
గూటికి చేరుకున్న పక్షిని

సమస్యలు నాతోపాటూ ముగింపులేని తూనీగ గుంపులు
పరిష్కారం కావని హెచ్చరిస్తున్న మనసు
ఆశలని ఎక్కడో వదిలేసుకుంటూ విడిచే చెప్పులు

ఇంట్లో పనికి రోబోట్ గూటీలో దూరగానే
వేయిచేతుల వందల సంజాయీషీల ష్యామే ఎ గజల్ ముదలవుతుంది
జుగల్బందీలో అందరూ గాయకులే
ఆగని పాటకి రాత్రీతెర అడ్దం పడుతుంది
నిద్ర తలగడఊయల వేసి జోకోడుతుంది
శరీరం బంధాలలేని నావలో తేలికపడుతూ
కలల సముద్రుని ఒడిలొ గారాలుపోతుంది

మొదటీ సూర్యకిరణం
ప్రకృతిని అల్లుకుంటూ వెలుగు చాపని గదిలో పరుస్తుంది
సరిగ్గా అప్పుడే వందల పక్షులు నాతోపాటూ గాలిలోకి ఎగురుతాయి

కాఫీ ఫిల్టర్లో చేరుకున్న మరుగుతున్ననీళ్ళు
నిన్నటి ఉదయాలని
మొదటి కప్పు కాఫీలోకి
చెక్కరతో కలిపేసి పాలలోకి జార్చేస్తాయి

కొత్త ఉదయం రంగులగజిబిజిలో అలావాటు పడిన ప్రాణం
ఆశల పల్లకీ మోస్తూ చనిపోయిన సమస్యలకి ప్రాణదానం చేస్తుంది.
ఉద్యోగం బందీఖానాకి హజరుపట్టీ వెసుకోవడానికి
చెప్పులుతో మొదలైన అడుగు వెలుగుతోపాటూ ప్రయాణిస్తుంది..

Sunday 19 April 2015

చదివిన కవిత్వ సంపుటి -27
(కవి సంగమం)
కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం "
పరిచయ కర్త : Rajaram Thumucharla
కవిసంగమం పొయెట్రీ గ్రూపునుంచి............
...See More
చదివిన కవిత్వ సంపుటి -27
(కవి సంగమం)
పరిచయమవుతున్న కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం "
కవిత్వ సంపుటి రాసిన కవయిత్రి :- "రేణుక అయోల "
సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి "
"చూసిన దాన్నో,చదివినదాన్నో,విన్నదాన్నో 'లోపలిస్వరం"తోకవిత్వం చేసింది రేణుక అయోల నే"
"The day I burn" ఆరోజు పదే పదే వెంటాడుతోంది "
ఆనందమో,సందేహమో
మెదడుని మొద్దుబారుస్తుంది
విన్నదే విని,వినీ వినీ
పక్షవాతం వచ్చినవాళ్ళలా
సొఫాలకి అతుక్కుపోయాక-
ఆ కరెంట్ వాడికే మనమీద దయ కలుగుతుంది
ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచిన మనం
చెర నుంచి విడిపించుకున్న ఖైదీలం..
మన కోసమే మనం కొంత మిగుల్చుకున్న జీవితాలం"
ఆ రోజు నిజంగా విన్నదే విని వినీ,చూసిందే చూసి చూసీ సోఫాలో పక్షవాతం వచ్చినవాడిలా అతుక్కూపోయి,ఇది తప్ప మరేదీలేదా? నాకోసం నేను కేటాయించుకొనే జీవితకాలం లేదా?-అని కాలి కాలీ,మరగి మరగి కరగిపోయిన రోజు కరెంట్ పోయి ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచి చెర నుండి బయటికొచ్చి స్వేఛ్చ పొందిన ఖైదీలా హాయిని పొందిన నాకు వినబడిన "లోపలి స్వరం"లోంచి వినబడిన మాటలు ఇవి. రేణుక అయోల గారి వాక్యాలివి.
ఆవిడది విద్వత్కవి కుటుంబం.ఆమె ముత్తాత శ్రీ కావ్యకంఠ గణపతిమహాముని. కవిత్వపు జిలుగులు తెలిసిన కవితా హృదయం గల కవయిత్రి.ఒఠ్ఠి హృదయం గలిగిన కవయిత్రే కాదు గట్టి కవిత్వం రాయగలిగిన నేర్పరి ఈమె.ఆమె ఏ చూసిందో,ఏం వినిందో, ఏం చదివిందో వాటిని తన హృదయం ఎట్లా కంపిస్తే అట్లా, జీవితంలోని అతి సాధారణ అనుభవాల్ని సైతం అతి చిన్న వాక్యాలతో,అత్యంత ప్రతిభావంతంగా కవిత్వం చేసిన కవయిత్రి ఎవరంటే రేణుక అయోల గారు.
"కాటుక లాంటి అడవి
నన్నెవరు చూడరనుకుంది
కారు మబ్బులు కమ్ముకొని
గాలి అందించిన చినుకు వరదలో
అడవి సేద తీరుతోంది"-
అడవి తీసుకొనే విశ్రాంతిని ఇంత అందంగా ఎవరు చిత్రించగలరు?
"చిన్న విత్తు
తనకు తానే భూమిలో ఒదిగి
కాలాని నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో
గున గున ఎదిగి పలరిస్తుంది"
విత్తనం అంకురించడం కాలానికీ నమస్కరించడంగా ఎవరూ ఊహించగలరు?
"నాగలి పట్టిన చేతులు
ఎడ్ల బండిని అదలించిన చేతులు
ధాన్యం,కొట్లో నింపిన చేతులు
పట్టె మంచం,తెల్లటి బొంత
కాళ్ళ దగ్గర రాగి చెంబు
తాతయ్య వెంటాడే ఙ్ఞాపకంలా ఉండేవారు"
ఇలా తాతయ్య రూపాన్ని మనస్సులో ముద్రించుకపోయేటట్లు రూపవర్ణన చేసిందెవరు?
"జనం మధ్యలో మనం,జనంలో ఒకరైన మనం
మనకే మనమే అపరిచుతులం
పరిచయాల్లేని ముఖాల మధ్య
మన ముఖమే మనకి అపరిచితం"
సమూహంలో ఒంటరైన మనిషి, తనను తానే గుర్తుపట్టలేని,తన అస్తిత్వాన్ని తానే తెలుసుకోలేని మనిషిని గూర్చి ఇంత తాత్వికంగా చెప్పిందెవరు?
అడవి విశ్రాంతిని అందంగా చిత్రించింది,విత్తనం మొలకెత్తే దృశ్యాన్ని కాలానికీ నమస్కరించడంగా ఊహించింది,తాతయ్య ఙ్ఞాపకాలతో ఆయన రూప చిత్రణను కళ్లముందు నిలబెట్టింది,ప్రజా సమూహంలో ఒంటరి అయిన మానవుని అస్తిత్వం ఆ మానవుడే గుర్తు పట్టలేనంత మారిన వైనాన్ని తన "లోపలి స్వరం"తో చెప్పింది రేణుక అయోల గారే.
చిన్నప్పటి నేస్తం ఇంట్లోంచి గుర్తు తెలీకుండా వెళ్ళిపోవడమో,సహాధ్యాయి అకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకీ చేరుకోవడమో, ఏదో ఒక వ్యసనపు మత్తులో అయినవార్ని,వున్న వూర్ని వీడి వెళ్ళిన వ్యక్తి ఙ్ఞప్తికి రావడమో,శిథిలమైన వూరి ఆనవాళ్ళు కళ్ళ ముందు నిలబడటమో,ఇంట్లోని పాత ఫోటొ గతించిన గుర్తులను తిరిగి తీసుక వచ్చి వొక దుఃఖపు వ్యధను కలిగించడమో,జీవితంలో ఎన్ని మాధుర్యపు అనుభూతులున్నా ఏదో తెలియని ఒంటరితనపు స్పర్శని అనుభవించడమో,చిన్ని పాపల ముద్దు మాటల మోహాంలో మునిగిపోవడమో,వూర్లోని చెరువు అద్దంలో ముఖాన్ని సరిదిద్దుకోవడమో ఎపుడైనా ఎవరికి వారు తమలోకి తొంగిచూసుకోవడమో,ఏదో ఒక రోజు వేసవి సాయంకాలం వర్షానికి తడవడమో,మన మతం కాని వారితో వున్న స్నేహాన్ని బేరీజు వేసుకోడమో,అభివృద్ది పేరిట జరిగే రోడ్డు మార్పుల్లో రూపు కోల్పోయిన చెట్లను చూసి వేదన పొందడమో,ఇంట్లో వున్న పాత సామానును చూచిపారేద్దామా?వుంచుకుందామా?అనేసంశయానికిగురికావడములాంటిఅనుభవాలు,అనుభూతులు అందరి జీవితాల్లోను వుంటాయి.అయితే వీటన్నిటిని కొందరు ఙ్ఞాపకాల బీరువాలో భంద్రంగా దాచుకొంటారు.కొందరు విస్మృతపథంలో వదిలేస్తారు.ఒకరో ఇద్దరో వాటిని మెరిసే అక్షరాలు చేసి నెమలీకలా బతుకు పుస్తకంలో దాచి పదే పదే చూసుకొంటుంటారు.
నేటి కాలంలో జీవితం నదిలా సంక్లిష్టాల,సంక్షోభాల,సుఖదుఃఖాల దరులను ఒరుసుకొంటు ప్రవహిస్తున్నది.అట్లా ప్రవహించే మానవ జీవితపు నదిని ప్రభావితం చేసే పైన చెప్పిన అత్యంత సూక్ష్మాతిసూక్ష్మ అనుభూతులు,రోజువారి అనుభవాలు కొందర్ని తీవ్రంగా స్పందింపచేసి అడ్భుత కవిత్వాన్ని రాయిస్తాయి.తన జీవిత నది యానంలో ఎదురైన అనేకానేక అనుభవాల అనుభూతుల స్పందనల్ని, రేణుకసాగేయేరులా,ఊగే సెలయేరులా,నడిచే నదిలా అందంగా,సాంద్రంగా,గంభీరంగా చిక్కటి అక్షరాలు చేసి వాటిని కవిత్వపు దారాలతోఅల్లింది.ఆగిపోని కవిత్వం చేసి తేమ లేని జీవితాల్లో కవిత్వంగా నాటింది. అందుకే "జీవితాన్ని కవితగా మార్చడంలో నేర్పరి రేణుక అయోల"-అని ప్రముఖ కవి, విమర్శకుడు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అనగలిగారు.
మనుషుల్లో కవులు విభిన్నంగా వుంటారేమోనని కొందరు భావిస్తుంటారు.అయితే కవులు కూడా మానవులే.ఈ కవయిత్రి తన తాతయ్య మాటల్లో కవుల గూర్చి"లోకం చుట్టూ దారాలల్లుకుంటూ సాలెగూడులో ఈగల్లా చిక్కుకుంటారు"-అంటూ వారి కవిత్వ దాహం పుస్తకాల దొంతరల్లో తీరు తుందని చెబుతారు.కవిత్వం మనిషిని మనిషిలా నిలబెడుతుంది,బ్రతికిస్తుంది అనే ఒక భావనను ఈ కవయిత్రి తన "కవిలోకం" అనే కవితలో బలంగా వ్యక్తంచేస్తుంది.అందుకే"ఎండిపోయిన పూల గింజలను ఏరుకొని కవిత్వాన్ని పూయిస్తారు"-అని అనగలిగింది.పాతిన గింజ అంకురించి కొత్త మొక్కనెట్లా యిస్తుందో అట్లాగే కవులు వారు రాసిన కవిత్వంఏ కాలందైనా చరిత్రను చెబుతూ జీవితంపై మనకు నమ్మకం కల్గిస్తారని ఈవిడ విశ్వాసం.దీన్ని కవిత్వమంతా ఒక అంతర్లీన అంతస్సూత్రంగా నిర్మిస్తూ జీవన సారాంశాన్ని కవిత్వం చేసింది.
కవయిత్రి రేణుక గారు తనతో పాటు చదివిన ఉష లేదని తెలిశాక రాసిన 'గాయం"అనే స్మృతి కవిత నిజంగా ఆవిడ మదిలో రేగిన గాయపు బాధంతా ఏకీకృత అక్షరంగా మారితే ఎలావుంటుందో అలా పాఠకుల్ని దుఃఖప్రవాహంలోకి లాక్కెలుతుంది.అందుకే రేణుక తన జీవిత అనుభవాన్ని మన అనుభవంగా మార్చి తన దిశగా ఆలోచింపచేస్తుంది.
"గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ
ఆనవాళ్ళను మిగులిస్తుంది
ఏ గాలి ఙ్ఞాపకానికో మళ్ళీ చెలరేగుతుంది
నిప్పు రవ్వ వచ్చిపడ్డట్లు గాయం రేగుతుంది
పొరలు విప్పుకొని
నిద్ర జడలు విదుల్చుకొని నాట్యం చేస్తుంది"
ఈ వాక్యాల్లోని భావ చిత్రం రేగిన గాయపు తీవ్రతని గుర్తుకు తెస్తుంది.
పాత గాయం అయినచోటే మళ్లీ గాయం కావడం సహజాతి సహజంగా జరుగుతుంటుంది.ఆ గాయాన్ని మాననీయవు.ఇదే అంశాన్నీ ఈ కవితలో "పాతవి కొత్తవి కలసి కలకలం రేపుతాయి/ గాయాన్ని మాననీయకుండా ఎక్కడెక్కడివో గుర్తుకొస్తుంటాయి"అని అంటూ ఈ గాయం నెత్తురు చిమ్మకుండా లావాలా ఉడుకుతూ కాల్చేస్తుందనే ఊహను చేసి..ఆ మరణపు గాయం మనసులేని శరీరం మీద మాయని మచ్చలా మిగిలిపోతుంది అనిచెప్పడం అంటే చెదిరిపోని గుర్తు అని కవయిత్రి గొప్ప పోలికలతో ఒక స్మృతిని మనముందు నిలుపుతుంది.
మాములుగా ఎవరైన కీర్తిని గడించాలని విపరీతంగా ప్రయత్నం చేస్తంటారు.ఆ కీర్తిని పొందడానికీ ప్రాణాల్నిసైతం ధారపోసిన వాళ్ళని చరిత్రలో చూడొచ్చు. చాల చిత్రంగా రేణుక గారు ఆ కీర్తి అనేది పతనానికీ సంకేతం అని తీర్మానిస్తుంది.ఈ మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.కానీ ఈవిడ తన భావనని ఎంతో సమర్థవంతంగా తార్కింగా నిరుపిస్తుంది ఈ కింది పంక్తుల్లో.
"కొందరిని కీర్తి బంగారు కీరిటమై
అందరిలోంచి ఒక్కడిగా నిలబెట్టి
అందరినుండి అపరిచితుడిగా లాక్కెళుతుంది
అసూయ డేగలా వెన్నాడితే
కీర్తి రాయిలా బరువై శత్రువులా మారుతుంది
మళ్ళీ నీలో నువ్వు నీ కోసం వెదుక్కునే దాక
కీర్తి వెంటాడుతూనే నిన్ను సంహరిస్తుంది"
కీర్తి దాహం ఆత్మ విశ్వాసపు సంకేతంగా నిలిచే బదులు అది పతనానికి ఎట్లా గుర్తయ్యిందో ఈ కవయిత్రి స్పష్టంగా చెబుతుతుంది.
ఎవర్నైనా చూసినప్పుడు ఏదోఒక భావం కలగడం అందరి అనుభవం.తాను చూసిన దాని వల్ల తాను పొందినానుభవాన్ని కవిత్వం చేయడం అందరు కవులు చేస్తారు.కానీ ఈ కవయిత్రి తన అన్నయ్య తన తాతగారి పాత ఫోటొ చూసినప్పుడు అతనిలో కలిగిన భావాల్ని కవిత్వం చేసిన విధం మాత్రం స్వంయంగా అనుభవించిన అబ్బురంగా అనిపిస్తుంది.ఇట్లాంటి పరమనోభావ గ్రహణ విద్య ఈ కవయిత్రికేట్లా తెలిసిందా అనుకున్నా.
"తాత పోలిక నాదంటారు
నాగలి పట్టి సరదాగా దున్ని
అరచేతులు చాచి చూపించాను
"భడవా"నాలాగే దున్నావురా-అనే తాతయ్య గొంతు
ఎప్పుడు ఈ ఇంటి గడపలో కాలుపెట్టినా ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది
"వీడిదంతా నా పోలికే"గుండెలకి హత్తుకున్న
చిత్రం కళ్ళముందుంటుంది
పాత గడియారం కింద తాత ఫోటొ
ఒకరోజు ఖాళీగా కనిపించింది
నా చేతిలో నా బుజ్జిగాడి నవ్వులో
"భడవ" ఇక్కడున్నానురా అంటూ-"
ముగింపు కూడా మనలోని ఒక నమ్మకాన్ని బలపరుస్తూ ఊహించని విధంగా చేసింది.
పాత్రలో,సీసాలో ఖాళీగా వుంటాయి.మాటలు ఎట్లా ఖాళీ గా వుంటాయి."నుదుటి మీదకి జరుగుతున్న తెల్ల వెంట్రుకలు,వణుకుతున్న చేతులు ,పట్టుకోసం చేతి కర్ర ఇంకా మిగిలివున్న ఊపిరితో వున్న రంగసాని ఖాళీ ముఖం చూశాక రాసిన"ఖాళీ మాటలు" " తెగిన మువ్వలొ కూడా నాట్యపు తిరస్కారం ఉంది"-అనే వాక్యం ఈ కవితకీ ప్రాణాధార వాక్యం.ఇట్లా కొన్ని మాటల్లోనే ఒక గొప్ప ఊహని చేసే ఆలోచనని పాఠకులకీ కలిగిస్తుంది.
"తేట నీటి చెరువులా అంతరంగం
ఆలోచనల చేప పిల్లలు లేవు
మనసు తొలిచే వింత జంతువులు లేవు
వృక్షాలై పెరిగిన అసూయలు లేవు
పేరు రూపం లేని ఉత్త బొమ్మలా తేలియాడుతున్నాను
మాయమైన రూపం కోసం వెదుకుతూ"
ఎవరికి వారు తమ అంతరంగంలోకి తొంగిచూసుకుంటే ఎట్లా వుంటుందో పై పంక్తులు చెబుతాయి.ప్రతి పంక్తిలో ఒక పోలికను చెబుతూ చెరువును అద్దంగా చేసి రాసిన కవిత "నీటి బొమ్మ"-అనేది.
వొక అందమైన భావాన్ని అక్షరాల్లోకి మార్చే మంత్రజాలం కూడా రేణుక గారికి తెలుసు.
"వాన వెలిసిన రాత్రి
ఆకాశంలో తారలు ఒక్కోక్కటి నడుచుకొంటూ
నీలి తెర మీద చమ్కీల్లా వేలాడుతుంటాయి
సందడి చేసి వెళ్ళిపోయిన వానకి గుర్తులు
ఇంటి చూరుల్లో రాలుతున్న నీటి బుడగలు"
వాన వెలిసిన తరువాతటి దృశ్యాన్ని ఇట్లా ఊహ చేయటం ఈమెకే చేతనయ్యిందేమో! "వెళ్ళిపోయిన వ్యక్తి ఙ్ఞాపకాలు/కళ్ళల్లో మిగిలిపోతాయి/మాటిమాటికి రెప్పలను ఒరుసుకొని/పారే కన్నీటి తడితో/వర్షం వెలిసిన ఆకాశంలా వాళ్ళంతా మిగిలిపోతారు"-ఇట్లాంటి దుఃఖపు తడి నిండిన వాక్యాలు ఈ కవయిత్రి చేతిలో పడి మనకీ మరింత విషాదాన్ని పంచుతాయి.
అదేమి చిత్రమో గానీ ఎందరు కవులు అమ్మను గురించి రాసినా ఇంకా రాయాల్సిందేదోవుంది అని అనిపిస్తుంది నాకు.అందర్ని వదిలివెళ్ళిపోయిన అమ్మ జీవిత ఙ్ఞాపకాలలోని విషాదాన్ని "పల్లకీలో పెళ్ళికూతురు"అనే కవితలో చిత్రిస్తే,చౌరాస్తాలో సిగ్నల్ లైట్ల దగ్గర ఒకచిన్న పిల్లాడిని ఎత్తుకొని అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని"వాడితో నా ప్రయాణం"అనే కవితలో చిత్రించింది ఈ కవయిత్రి రేణుక గారు.
అమ్మను ఖననమో,దహనమో చేయాడానికీ ముందు ఆమె చేతులకున్న గాజులు,కాళ్ళకున్న కడియాలను పంచుకొన్న తరువాత 'పాత సామానుల కొట్టులోకి వెళ్ళిపోయిన సందూకపెట్టె గురించి,అందులో అమ్మ దాచుకొన్న అపురూప గుర్తులను నెమరేసుకొంటూ,ఏనాడు పేరు పెట్టి పిలువని నాన్న కారణంగా తన పేరేమిటో మరచిపోయిన అమ్మను మనసులోకి తెచ్చుకొంటూ,కూరలో ఉప్పు ఎక్కువైతే పళ్ళెం ముఖాన విసిరికొట్టిన అభిమానాలు ఆప్యాయతలు పంచి ఇవ్వడమే తెలిసిన అమ్మలో తనను చూసుకున్న స్త్రీ మనో భావాల్ని గొప్పగా ఈ కవయిత్రీ ఆవిష్కరించింది.
"భుజం మీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీర ముక్క ఊయలని
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభవాలకీ మూగపల్లకీనవుతాను"
ఇలా ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు రోడ్ల కూడలిలో తన చంకనో వీపునో పిల్లాడిని మోస్తూ అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని ఈ కవయిత్రి రూపు కట్టించింది.
"ఊయలగా నేను జోరుగా ఊగి-
వాడి దుఃఖాన్ని చెరిపే కొమ్మ మీద పిట్ట కోసం ఎదురుచూస్తాను
వాడికి కావలసింది అమ్మ
అమ్మకి కావలి ఆకలి తీర్చే ఆదాయం
జీవితం ట్రాఫిక్ సిగ్న్ల్ దగ్గర ఆగిపోయింది"
ఈ మాటలు మనలి కూడా అక్కడే ఆపేస్తాయి.వొక అద్భుతశిల్పంతో ఈ రెండు కవితలే ఇంకా చాల కవితలు రేణుక అయోల గారిని ఒక మంచి కవయిత్రిగా నిలబెడతాయి పాఠకుల ఎదుట.
"నన్ను నువ్వు తెలుసుకోవాలంటే యుగాలతో సంభాషణ జరపాలి"-అని అనటంలో కాలాన్ని స్ఫురింపచేస్తూ,నీటి జల్లులస్పర్శ,తడిపూల వర్షం,పిట్టల సయ్యాట లాంటివాక్యాలతో గుండె గుడిలో గిలిగింతలు పెడుతూ, "నది నా ఆత్మ,నది నా బాల్యం "అంటూనదిని అమ్మలా పలకరిస్తూ,ప్రతి కవితలో ఒక అనుభవ ధూళిని పంచుతూ,కెమెరాకందని జీవితం,కాగితాల కందనిఅనుభవన్నీ కవిత్వమంతా పరచిన కవయిత్రి రేణుక అయోల అంటున్నా నేను.రాయవల్సిన వాక్యాలు ఇంకా ఎన్నో వున్నా" రాత్రి ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక దాని పక్కనే మినుమినుకుమంటున్న నక్షత్రం"ఇక చాలని అంటున్నాయి కాబట్టి...ఒక మంచి కవితా సంపుటిని అందించిన కవయిత్రికి మనఃస్పూర్తిగా అభినందనలు అందజేస్తు..వచ్చే మంగళవారం మరొక కవితా సంపుటితో కలుద్దాం.అంతవరకు మిత్రులు ఈ కవిత సంపుటి పఠనంలో వుంటారని ఆశిస్తాను.
Like · Comment ·